Headlines

Andhra Weather: హమ్మయ్య.. మండే ఎండల్లో చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ | Monsoon Advances Further; Rains, Thunderstorms and Strong Winds Likely in Andhra Pradesh


తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలు, అండమాన్ సముద్రంలో మరింతగా విస్తరించాయి. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. అలాగే నైరుతి బీహార్ నుంచి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

శనివారం, ఆదివారం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగనున్నప్పటికీ గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని తెలిపారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి గాలుల తీవ్రత కొంత తగ్గినా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

రాయలసీమలో వర్ష సూచనలు

రాయలసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్లుండి గాలుల వేగం కొంత తగ్గినా వర్ష సూచనలు కొనసాగనున్నాయి.

వర్షాలు పడుతున్నప్పటికీ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం మరో రెండు రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోయినా.. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేకుండా బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *