Headlines

ఉద్యోగులు, విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్.. బక్రీద్ సెలవు తేదీలో మార్పు! | Andhra Pradesh Government Reschedules Bakrid Holiday to May 28


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా గతంలో ప్రకటించిన సెలవు తేదీలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత మే 27న సాధారణ సెలవుగా నిర్ణయించినప్పటికీ, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ సెలవును మే 28కి మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది.

సాధారణంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం ముందుగా విడుదల చేసిన వార్షిక క్యాలెండర్‌లో మే 27న బక్రీద్ సెలవుగా పేర్కొంది. అయితే, చంద్ర దర్శనం ఆధారంగా పండుగ తేదీల్లో మార్పు వచ్చే అవకాశం ఉన్నందున, స్పష్టత కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు నుంచి నివేదిక కోరింది. వక్ఫ్ బోర్డు పంపిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది బక్రీద్ పండుగ మే 28న నిర్వహించబడుతుందని, కావున సెలవును కూడా అదే రోజుకు మార్చాలని సూచించారు. ముస్లింల మనోభావాలను, పండుగ ప్రాముఖ్యతను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ మార్పుకు అంగీకరించింది.

ఈ మార్పుకు సంబంధించి ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి నంబర్ 1006ను జారీ చేసింది. దీని ప్రకారం మే 27న గతంలో ప్రకటించిన సెలవు రద్దు చేసింది. మే 28 (గురువారం) రోజును రాష్ట్రవ్యాప్తంగా ‘సాధారణ సెలవు’గా ప్రకటించారు. ఈ ఉత్తర్వు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు వర్తిస్తుంది.

పండుగ రోజునే సెలవు ఉండటం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. పండుగ ప్రార్థనలు, బంధుమిత్రుల కలయిక వంటి కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. కాగా, ప్రభుత్వ గెజిట్‌లో కూడా ఈ మార్పును ఇప్పటికే నమోదు చేశారు. ప్రజలు, విద్యార్థులు ఈ కొత్త తేదీని గమనించి తమ ప్రయాణాలను లేదా ఇతర కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పండుగ తేదీల్లో ఇలాంటి మార్పులు సహజమే అయినప్పటికీ, ప్రభుత్వం సకాలంలో స్పందించి పండుగ రోజే సెలవు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Ap Government Go

Ap Government Go

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *