Headlines

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు: ఎమ్మెల్సీ నాగబాబు | MLC Naga Babu Lays Foundation To Sirivennela Memorial Park In Anakapalle, Details Inside


ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి చెంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి అని రాష్ట్ర శాసనమండలి సభ్యులు కె. నాగబాబు తెలిపారు. ఆయన ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్‌లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సిరివెన్నెల స్మృతివనం’కు నాగబాబు బుధవారం (మే 20) శంకుస్థాపన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ..’ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిసినప్పుడల్లా అన్నయ్య అని పిలిచేవాడిని. ఆయన కూడా అదే ఆప్యాయతతో తమ్ముడు.. అని పిలిచేవారు. ఆయన పుట్టిన ప్రాంతానికి వచ్చి, చిన్ననాటినుంచి ఆయన నడయాడిన ప్రదేశంలో నా చేతులమీదుగా స్మృతివనం శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. “నాగబాబు వచ్చి నా స్మృతివనం శంకుస్థాపన చేయి..” అని శాస్త్రిగారు పిలిచినట్టు అనిపించింది’

‘రుద్రవీణ చిత్రం నిర్మాణ దశలో బాలచందర్ శాస్త్రి గారిని పిలిపించి మాట్లాడారు. రుద్రవీణ చిత్రంలోని పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. శ్రీశ్రీ రాసిన “నేను సైతం..” అనే ఒక లైన్ తీసుకొని గొప్పపాటను రాసిన గొప్పరచయిత సిరివెన్నెల. “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమిని…” అనే గొప్పపాట నాతోపాటుగా, అనేకమందికి స్పూర్తిగా నిలుస్తుంది. ఎదుటివారికి సహాయం చేయడమే కానీ ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు. ముస్లిం మతానికి చెందిన ఒక బాలుడిని చదివించి, అతన్ని ప్రయోజకుణ్ణి చేసిన విధానం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కులాలకు, మతాలకు అతీతంగా బ్రతికేవారు అని చెప్పడానికి నిదర్శనం. ఆయన సంపాదించుకున్నదంతా బంధువులకు, సన్నిహితులకు, ప్రజలకు గుప్తదానాలుగా అందజేశారు. ఎంతోమంది పేదవిద్యార్థులను చదివించారు. ఆయన రాసిన పాటలన్ని ఆణిముత్యాలుగా నిలిచాయి. అలాంటి మహానుభావుని స్మరించుకోవడం ఆనందంగా ఉంది. అన్నయ్య చిరంజీవి ని, పవన్ కళ్యాణ్ ని, వరుణ్ బాబును సొంత మనుషులుగా ప్రేమించేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడల్లా “మీరు పుట్టిందే ప్రజల కోసం, ప్రజలు మీకు పట్టం కట్టే రోజు ఒకటి వస్తుందని..” అనేవారు. ఈ రోజు ఆయన బతికి ఉంటే ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ను చూసి చాలా సంతోషించే వారు’ అని నాగబాబు ఎమోషనల్ గా మాట్లాడారు.

ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పేరు మీద స్మృతివనం నిర్మిస్తున్న, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణకు, ఇతర నిర్వాహకులకు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భాస్కర భట్ల రవికుమార్ గారికి సిరివెన్నెల స్మారక పురస్కారం ప్రధానం చేయడం ఆనందంగా ఉన్నదని, ఆయనకు అభినందనలు తెలిపారు. ఇదే కార్యక్రమంలో కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మన అనకాపల్లి ప్రాంతానికి చెందినవారని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నదని, ఆయన పేరుమీద భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

Sirivennela Memorial Park 1

Sirivennela Memorial Park

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *