Headlines

Heatwave: అగ్నిగుండంలా మండుతున్న భారత్.. 50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణలో | India Scorched by Severe Heatwave: IMD Issues Red Alerts Across Telangana, Andhra Pradesh and North India


దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుటెండలు, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం రాబోయే ఆరు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగనుంది. బలూచిస్తాన్, రాజస్థాన్ థార్ ఎడారి నుంచి వీస్తున్న వేడి గాలులు ఉత్తర, మధ్య భారత్‌లో వడగాలుల పరిస్థితులను తీవ్రతరం చేస్తున్నాయి.వాతావరణ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ,పంజాబ్,తదితర రాష్ట్రాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో

తెలంగాణలో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.నేడు 14 జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ అయ్యింది..ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 45°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా..ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 45°C దాటే అవకాశం ఉంది.. రామగుండంలో 44.6°C, నిజామాబాద్‌లో 44.4°C, ఆదిలాబాద్‌లో 44.3°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 39.5°Cకు పరిమితమైనా ఉక్కపోత తీవ్రంగా కొనసాగుతోంది..రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది .. మే 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా హీట్‌వేవ్ అలర్ట్ కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలుల హెచ్చరిక కూడా జారీ అయ్యింది.  మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది

ఏపీలో ఎండల తీవ్రత

ఏపీలో సైతం ఎండల తీవ్రత కొనసాగుతుంది..రానున్న నాలుగురోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది..పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 – 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మే 26 వరకు ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ

ఎండ,వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో వాతావరణ శాఖ ఢిల్లీలో మే 26 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన చేసింది.. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని అంచనా వేసింది. కనిష్ట ఉష్ణోగ్రత 27 నుంచి 29 డిగ్రీల మధ్య ఉంటుందని తెలిపింది. నిన్న ముంగేష్‌పూర్ ప్రాంతంలో గరిష్టంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2024లో అదే ప్రాంతంలో 50 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలు నమోదు కావడం గుర్తుచేస్తోంది.తీవ్రమైన వేడి కారణంగా ప్రజలు రాత్రి సమయంలో కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. పగటి వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

బుధవారం నాటి గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్)

బండా (తూర్పు ఉత్తరప్రదేశ్) : 48.0

ఖజురహో (తూర్పు మధ్యప్రదేశ్) : 47.4

వార్ధా (విదర్భ) : 47.1

రోహ్తక్ (హర్యానా) : 46.9

నాగపూర్ : 46.6

శ్రీగంగానగర్ : 46.5

చంద్రపూర్ : 46.2

ఝార్సుగూడ : 46.0

ఝాన్సీ : 45.9

రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపద్యంలో వాతావరణ శాఖ అధికారులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండలో బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు,, గర్భిణీలు, బయట పనులు చేసే కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు..మజ్జిగ, ORS, బార్లీ వాటర్, ఎలక్ట్రాల్, మంచినీరు తరచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *