Headlines

Indian Railways: రైల్వే స్టేషన్‌లో పళ్ళు తోముతున్నారా? అయితే జాగ్రత్త.. రైల్వే కొత్త రూల్స్ ఇవే! | Indain Railway Rules Safety Tips: Brushing Teeth, Washing Utensils On Railway station Platforms Now A Rs 500 Offense


రైల్వే స్టేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది రద్దీ, రైళ్ల కూతలు, ప్రయాణికుల హడావుడి. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఉదయాన్నే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. చాలా మంది ప్రయాణికులు రైలు దిగగానే ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న కుళాయిల (Water Taps) వద్దకు పరుగెత్తుతారు. అక్కడే లైన్లలో నిలబడి పళ్ళు తోముకోవడం, ముఖం కడుక్కోవడం, కొందరైతే తాము తెచ్చుకున్న క్యారియర్లు, పాత్రలను కూడా అక్కడే కడగడం మనం తరచుగా చూస్తుంటాం. ఆ తర్వాతే పక్కనే ఉన్న స్టాళ్లలో టీ, అల్పాహారం తీసుకుంటారు. సాధారణంగా కనిపించే ఈ అలవాటు వెనుక ఒక పెద్ద చట్టపరమైన చిక్కు ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

నిజానికి, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై బహిరంగంగా పళ్ళు తోముకోవడం లేదా గిన్నెలు కడగడం తీవ్రమైన నేరం. రైల్వే నిబంధనల ప్రకారం, ముఖ్యంగా 1989 రైల్వే చట్టం (Railway Act 1989) లోని సెక్షన్ల ప్రకారం, రైల్వే ప్రాంగణంలో నిర్దేశిత ప్రాంతాల వెలుపల ఇటువంటి పనులు చేయడం చట్టవిరుద్ధం. ప్లాట్‌ఫారమ్ కుళాయిల వద్ద పళ్ళు తోముకోవడం, ఉమ్మివేయడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం లేదా ఇతర వస్తువులను శుభ్రపరచడం వంటి చర్యలను రైల్వే శాఖ ‘పబ్లిక్ న్యూసెన్స్‌’గా పరిగణిస్తుంది. ప్రయాణికులు ఇటువంటి పనులను తప్పనిసరిగా చేయవలసి వస్తే, స్టేషన్లలో అందుబాటులో ఉండే వాష్‌రూమ్‌లు, వెయిటింగ్ హాళ్లు లేదా నిర్దేశిత స్నానపు ప్రాంతాలలో (Bathing Areas) మాత్రమే చేయాలి.

ఎంత జరిమానా విధించవచ్చు?

రైల్వే ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఒక ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్‌పై లేదా రైల్వే ప్రాంగణంలో నిషేధిత ప్రదేశంలో పళ్ళు తోముకున్నా, పాత్రలు కడిగినా లేదా ఉమ్మివేసినా వారికి రూ. 500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రైల్వే వాణిజ్య విభాగం, స్క్వాడ్ సిబ్బంది అటువంటి వ్యక్తులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, పట్టుబడితే జరిమానాలు విధిస్తారు. కొన్నిసార్లు తీవ్రతను బట్టి చట్టపరమైన విచారణ కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.

కేవలం పళ్ళు తోముకోవడం, గిన్నెలు కడగడమే కాదు.. రైల్వే ప్రాంగణంలో మరికొన్ని పనులు చేయడం కూడా చట్టప్రకారం నేరాలే. ప్లాట్‌ఫారమ్‌పై లేదా రైలు పట్టాల పక్కన తినిపారేసిన కవర్లు, ఖాళీ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు పడేయడం. రైల్వే స్టేషన్ గోడలపై లేదా రైలు లోపల పిచ్చి రాతలు రాయడం, అనుమతి లేకుండా స్టిక్కర్లు, పోస్టర్లు అతికించడం నేరం. నిర్దేశిత శౌచాలయాలు కాకుండా ఖాళీ ప్రదేశాలలో, పట్టాల వెంబడి మూత్ర విసర్జన చేయడం రైల్వే చట్టం ప్రకారం నేరం.

ప్రయాణికులకు సూచనలు

రైలు ప్రయాణం సురక్షితంగా, గౌరవప్రదంగా సాగాలంటే ప్రయాణికులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ప్లాట్‌ఫారమ్‌లపై ఉండే కుళాయిలు కేవలం తాగే నీటి కోసం లేదా అత్యవసర అవసరాల కోసం మాత్రమే ఏర్పాటు చేయడ జరిగింది. వ్యక్తిగత శుభ్రత కోసం రైల్లోని బేసిన్లను లేదా స్టేషన్ లోని పే-అండ్-యూజ్ టాయిలెట్లను ఉపయోగించడం ఉత్తమం. చట్టాలపై అవగాహన పెంచుకోవడం వల్ల జరిమానాల నుంచి తప్పించుకోవడమే కాకుండా, మన దేశ రైల్వే స్టేషన్లను స్వచ్ఛంగా ఉంచడంలో భాగస్వామ్యులం కావచ్చు. సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన ప్రయాణం అందరి హక్కు, బాధ్యత.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *