Headlines

పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన మహిళ ఎస్సై | Female SI Caught Red Handed by ACB While Accepting Bribe at Police Station


హైదరాబాద్: సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో బోయినపల్లి పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై నందిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో సహకారం అందించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై నందిత బాధితుడిని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “స్టేషన్‌లో అందరికీ వాటాలు ఇవ్వాలి” అంటూ అదనంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఈ వ్యవహారాన్ని అవినీతి నిరోధకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ట్రాప్ చేసి లంచం తీసుకుంటున్న ఎస్ఐని పట్టుకున్నారు.

బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు నేరుగా సోదాలు చేసి ఎస్సై నందితను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న పోలీస్ అధికారిణి అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నందితపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *