Headlines

Eid Al Adha 2026: బక్రీద్ సెలవుపై బిగ్ ట్విస్ట్.. పండగ ఆ రోజు కాదు.. ఎప్పుడంటే..? | Bakrid to Be Celebrated on May 28 2026 as Dhul Hijjah Moon Sighting Delayed, Eid Ul Adha Holiday Postponed


ఈద్ అల్-అధా (బక్రీద్) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన ధు అల్-హిజ్జా 10వ రోజున వస్తుంది.. అయితే.. ఈ సారి బక్రీద్ పండుగ తేదీపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. దుల్ హిజ్జా (Dhul-Hijjah) నెలవంక దర్శనం ఆలస్యం కావడం.. దీంతో పండుగ తేదీ మారిందని.. పండుగను అనుకున్న రోజు తర్వాత నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బక్రీద్ సెలవు తేదీని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక క్యాలెండర్‌లో మే 27న బక్రీద్ సెలవు ప్రకటించినప్పటికీ.. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో పండుగ తేదీ ఒకరోజు తర్వాత మారింది.

దుల్ హిజ్జా (Dhul-Hijjah) నెలవంక దర్శనం తర్వాత.. హైదరాబాద్ పాతబస్తీలో ప్రత్యేక సమావేశమైన ముస్లిం మత పెద్దలు, ఉలమా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈసారి బక్రీద్ పండుగను మే 28 గురువారం జరుపుకోనున్నారు. దీంతో ప్రభుత్వం కూడా అధికారిక సెలవును ఒక రోజు వాయిదా వేసి 28వ తేదీకి మార్చాలని ముస్లిం మత పెద్దలు, పలు సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

సదర్ మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-దక్కన్ ప్రకటించిన ప్రకారం.. ఆదివారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నెలవంక కనిపిస్తేనే పండుగ తేదీలకు ఆధారం కావడంతో జీ ఖాదా నెల 30 రోజులు పూర్తవుతుందని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో మే 19ను జిల్ హిజ్జా తొలి రోజుగా ప్రకటించారు. దాంతో బక్రీద్ పండుగ మే 28న జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం మే 27ను అధికారిక సెలవుగా ప్రకటించడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వర్గాల్లో కొంత అయోమయం నెలకొంది.

ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులు, విద్యార్థులు పండుగ రోజు సెలవు ఉండేలా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మతపెద్దలు కూడా నెలవంక ఆధారంగా నిర్ణయించిన తేదీ ప్రకారమే పండుగ నిర్వహించాల్సి ఉంటుందని, అందువల్ల సెలవు తేదీ కూడా మారాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు

ఊపందుకున్న మేకలు, గొర్రెల విక్రయాలు..

ఇదిలాఉంటే.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే బక్రీద్ సందడి ప్రారంభమైంది. పండుగను దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలిక పశువుల మార్కెట్లు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మేకలు, గొర్రెల విక్రయాలు వేగంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బక్రీద్ మార్కెట్‌లో మంచి వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పశువుల ధరలు కొంత పెరిగినప్పటికీ, డిమాండ్ మాత్రం తగ్గలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదులు కూడా పండుగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

ఇక సెలవు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముందని సమాచారం. ప్రభుత్వం 27వ తేదీ ప్రకటించిన సెలవును 28వ తేదీకి బదిలీ చేస్తే ముస్లిం సమాజానికి అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *