తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులతో పాటు వైకాపాకు చెందిన 24 మంది కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులతో పాటు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను పోలీసులు తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జేసీ ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిరసన తెలిపారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
