Headlines

ప్రియుడిపై మోజు.. కన్న కొడుకుపై కర్కశత్వం.. ఓ తల్లి నిర్వాకం! చిన్నారి మర్మాంగంపై బ్లేడ్‌తో.. | Chittoor Horror: Mother and Lover Allegedly Torture 7 Year Old Boy Over Illicit Relationship


మానవత్వం మంటగలిసిపోతోంది. అనుబంధానికి మారుపేరుగా నిలిచే తల్లి ప్రేమ కూడా వివాహేతర సంబంధం కోసం కర్కశంగా మారుతోంది. ప్రియుడితో ఉండేందుకు కన్న కొడుకు అడ్డుగా ఉన్నాడని, పాపం పసివాడని కూడా చూడకుండా కన్న తల్లే చిత్రహింసలు పెట్టింది. ఈ దారుణం ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వీ.కోట మండలంలోని ఈశ్వర్‌నగర్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి, తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలుడి శరీరంపై, మర్మాంగాల వద్ద బ్లేడ్‌తో గాయపరిచినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వర్ నగర్‌కు చెందిన ఇంద్రజ తన ఏడేళ్ల కుమారుడు విశాల్‌తో కలిసి నివాసం ఉంటోంది. కొద్ది నెలల క్రితం ఆమె భర్త మరణించగా, అనంతరం ఎర్రచేనుకు చెందిన రాజుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు విచారణలో వెల్లడైంది. ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించడంలో కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి, ఆమెతో ఉన్న వ్యక్తి బాలుడిని తీవ్రంగా హింసిస్తుండగా, అతని కేకలు విన్న ఇంటి యజమాని సావిత్రమ్మ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఘటన అనంతరం ఇంద్రజ, రాజు ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బాలుడిపై జరిగిన దాడికి గల పూర్తి కారణాలు, ఘటన వెనుక ఉన్న పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *