Headlines

Andhra Pradesh: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటలో కనిపించిన రెండు బొమ్మలు.. అసలు కథ ఏంటంటే..? | Twist in Tuni Girl Jahnavi Missing Case: Mysterious Dolls Appear in Palm Oil Plantation..


కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ప్రాంతంలో గత 11 రోజులుగా అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జాహ్నవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తాజాగా పాప తప్పిపోయిన ప్రాంతంలో రెండు బొమ్మలు ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జాహ్నవి అదృశ్యమైన పామాయిల్ తోటలోని పొలం కంచెకు ఈ రెండు బొమ్మలను వేలాడదీసినట్లు గుర్తించారు. అయితే దీనిపై తుని రూరల్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేస్ సీన్ రీకన్స్ట్రక్షన్‌లో భాగంగానే తాము ఈ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అటవీ ప్రాంతం కావడంతో క్రూర జంతువులు వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో.. ఆ బొమ్మల్లో చికెన్ ముక్కలు పెట్టి ఎరవేసినట్లు పోలీసులు వివరించారు.

40 ఎకరాల తోట.. 200 మంది సిబ్బంది.. హైటెక్ గాలింపు..

చిన్నారి జాడ కనుగొనేందుకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిపి 200 మందికి పైగా సిబ్బంది దట్టమైన అడవులు, 40 ఎకరాల పామాయిల్ తోటను జల్లెడ పడుతున్నారు. సాంకేతికతను గరిష్టంగా ఉపయోగిస్తూ హనుమాన్ బృందాలు పగలు, రాత్రి తేడా లేకుండా గాలిస్తున్నాయి. వేడి ఆధారంగా మనుషులు, జంతువుల కదలికలను కనిపెట్టే థర్మల్ డ్రోన్ల సాయంతో నిన్న అర్ధరాత్రి దాటాక కూడా దట్టమైన తోటలను క్షుణ్ణంగా పరిశీలించారు. లైవ్ వీడియో ప్రసారం, జీపీఎస్ ట్రాకింగ్ వంటి హైటెక్ సదుపాయాలు కలిగిన డ్రోన్‌లతో పాటు.. రేడియేషన్ డిటెక్టర్ మిషన్లను సైతం చిన్నారి ఆచూకీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చిన్నారి జాడ మాత్రం లభించకపోవడం ఉత్కంఠ రేపుతోంది.

కొండచిలువ దాడి చేసిందా? వన్యప్రాణులు లేవా?

చిన్నారి కొండచిలువ లేదా ఇతర క్రూర మృగాల బారిన పడి ఉండవచ్చని పోలీసులు ఒకవైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారమే లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో చుట్టూ కంచె ఉన్న తోట నుంచి పాప ఒంటరిగా ఎలా వెళ్లగలిగింది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. మరోవైపు మంగళవారం రాత్రి ఒంటిగంట లోపు చిన్నారి జాడ కనిపిస్తుందని ఒక జ్యోతిష్యుడు చెప్పినట్లు వస్తున్న వార్తలు స్థానికంగా సంచలనంగా మారాయి.

హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి..

చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసుపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని ఆకాంక్షించిన ఆమె.. ఈ కేసు పురోగతిపై ప్రతిరోజు జిల్లా ఎస్పీతో మాట్లాడుతున్నానని తెలిపారు. త్వరలోనే పాప తల్లిదండ్రులైన భవాని, గణేష్‌లను తాను స్వయంగా వెళ్లి కలుస్తానని, ఆ తల్లికి తన పూర్తి మద్దతు ఉంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. అలాగే చిన్నారిని గుర్తించడంలో సహాయపడుతూ అకస్మాత్తుగా చనిపోయిన డాగ్ స్క్వాడ్ కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించారని, ఆ రిపోర్ట్ రావడానికి ఒక రోజు పడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *